ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా..

ప్రకటించిన ఫలితాల్లో  11 చోట్ల ఇండియా కూటమిదే  హవా..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ఇండియా బ్లాక్ ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.. 11 చోట్ల ఇండియా బ్లాక్ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. 

Read More బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

మిగతా రెండు చోట్ల ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మూడు, ఉత్తరాఖండ్‌ లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళ నాడు, మధ్య ప్రదేశ్‌ లోని ఒక్కో స్థానానికి జులై 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది. 

పంజాబ్‌ లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

అలాగే.. పశ్చిమ బెంగాల్‌ లోని మానిక్‌తలా, బాగ్దా, రాణా ఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌ గంజ్‌.. మొత్తం నాలుగు స్థానంలో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

హిమాచల్‌ ప్రదేశ్‌ లోని దేహ్రాలో రాష్ట్ర ముఖ్య మంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ ముందంజలో ఉన్నారు. 

నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. హమీర్‌పుర్‌లో బీజేపీ నేత ముందంజలో ఉన్నారు. 

ఉత్తరాఖండ్‌ లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌.. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మధ్య ప్రదేశ్‌ లోని అమర్‌వాడా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరన్‌ షా ముందంజలో ఉన్నారు. 

బిహార్‌ లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడు లోని విక్రావండిలో డీఎంకే నేత అన్నియుర్‌ శివ ముందంజలో ఉన్నారు..