నల్గొండ ప్రభుత్వ దవాఖాన లో దారుణం 

నల్గొండ ప్రభుత్వ దవాఖాన లో దారుణం 

విశ్వంభర, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన నల్లగొండ జిల్లా ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి అశ్విని గర్భిణి(Pregnant) గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పంపించారు.


దేవరకొండ నుంచి అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా దవాఖానకు చేరుకున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని హాస్పిటల్‌ సిబ్బంది వారిని ప్రశ్నించారు. మూడో కాన్పు దేవరకొండలో చేయించక ఇక్కడి దాక రావడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో అశ్వినిని బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు నర్సులు. నొప్పులు వస్తున్నాయి అని చెప్పినప్పటికి ఎవరు పట్టించుకోలేదు. తీవ్ర నొప్పులతో బాధ పడుతూ అశ్విని కుర్చీలోనే డెలివరీ (Delivery)అయింది. కుర్చీ కింద తీవ్ర రక్త స్రావం కావడంతో అప్పుడు హాస్పిటల్‌ సిబ్బంది వచ్చి హడావుడి చేస్తూ పేషెంట్ పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరువాత లోపలికి తీసుకెళ్లారు.

Read More రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు - బిఎన్  రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై అక్కడే ఉన్న ఇతర రోగుల బంధువులు, ఇతరులు వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదని, నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్, నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ హుటాహుటిగా హాస్పిటల్‌కు తరలి వచ్చారు. ఘటనపై వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యల కోసం నివేదికను ఉన్నతధికారులకు అందజేస్థానని తెలిపారు.

Tags: