నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ నాగరాజుకు డాక్టరేట్

విశ్వంభర, రామన్నపేట: హిందీ దళిత్ కహానియో మే ఛత్రిత్ దళిత్ జీవన్ కా యతార్థ్ (1980 -2010)కే సందర్బ్ మే"అను అంశంపై హిందీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ మాయాదేవి వాగ్మారే మార్గదర్శకంలో పరిశోధన పూర్తి చేసినందుకు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని నాగార్జున స్కూల్ కరెస్పాండెంట్ నకిరేకంటి నాగరాజుకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. నాగరాజు వ్యవసాయ ఆధారిత కుటుంబ నేపథ్యంలో తన నాన్నకు చేదోడుగా ఉంటూ స్థానికంగా పాఠశాల విద్యాభ్యాసం మొదలుకొని రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఉన్నత చదువులపై ఆసక్తితో పీజీ కాలేజ్ సికింద్రాబాద్, ఓయూలో ఎం.ఏ హిందీ పూర్తి చేసి పిహెచ్.డి లో సీట్ పొందడం జరిగింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మిత్రుల సహకారంతో ఊరికి దూరంగా ఉంటూ కష్టనష్టాలకు నిరుత్సాహపడకుండా, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ పట్టుదలతో శ్రమించి పిహెచ్.డి పూర్తి చేశానన్నారు. పిహెచ్.డి పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాగరాజు డాక్టరేట్ పొందిన సందర్భంగా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, మిత్రులు హర్షం వ్యక్తంచేశారు.